News

రూ.5వేలకు మించి డిపాజిట్‌ ఒక్కసారే


బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై కేంద్రం పరిమితి విధించింది. డిసెంబర్‌ 30లోగా రూ.5వేలకు పైబడిన నగదును ఒక్కసారి మాత్రమే డిపాజిట్‌ చేసుకునేలా బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీచేసింది. అయితే, ఇటీవల నల్లధన వెల్లడి కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) డిపాజిట్లకు మాత్రం ఈ పరిమితి వర్తించదు. అంతేకాకుండా రూ.5వేలు పైబడి మొత్తాల డిపాజిట్‌పై బ్యాంకు అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎందుకు డిపాజిట్‌ చేయలేదు? డిపాజిట్‌కు గల ఆలస్యమేమిటన్న ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. కేవైసీ పత్రాలు సక్రమంగా ఉంటేనే రూ.50వేలకు పైబడి డిపాజిట్లు తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ఇప్పటివరకు రోజువారీ డిపాజిట్లపై పరిమితి విధించని కేంద్రం.. తాజా నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెల్లో గుబులు పుట్టించింది. హడావుడి తగ్గాక చివరి నిమిషంలో మెల్లగా నోట్లు మార్చుకోవచ్చనుకున్నవారికి ఇది షాకింగ్‌ నిర్ణయం కానుంది.